జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ ( 2026) ప్రవేశ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.
సెక్యూరిటీ చెక్లను నిబంధనల ప్రకారం కఠినంగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.ఈ పర్యవేక్షణలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రామ్ మోహన్ రెడ్డి, అబ్జర్వర్లు డాక్టర్ మహేందర్, డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నగర రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ రాజ్, మూడో పట్టణ ఎస్సై హరి బాబు తదితరులు పాల్గొన్నారు.
