ఖైదీల బంధువులకు న్యాయ సహాయం, దరఖాస్తుల పూర్తికి వెసులుబాటుజిల్లా కేంద్ర కారాగారంలో (సెంట్రల్ జైలు) ఖైదీలను కలవడానికి వచ్చే వారి సౌకర్యార్థం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మూలాఖత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్’ శుక్రవారం ప్రారంభమైంది.
సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉదయకృష్ణ, సబ్ జైలర్ మన్మధరావుతో కలిసి జైలు మూలాఖత్ గదిలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయకృష్ణ మాట్లాడుతూ.. జ్యుడీషియల్ రిమాండ్ ఉన్న ఖైదీలు, కోర్టుల ద్వారా శిక్ష పడిన వారిని చూసేందుకు వచ్చే బంధుమిత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ డెస్క్ సంధానకర్తగా పనిచేస్తుందన్నారు.
మూలాఖత్కు వచ్చేవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు ఉంటారని, వారికి దరఖాస్తులు నింపడంతో పాటు అవసరమైన ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ హెల్ప్ డెస్క్లో ఇద్దరు న్యాయసేవ సంస్థ ప్యానల్ న్యాయవాదులు, ఒక జైలర్, ముగ్గురు పారా లీగల్ వాలంటీర్లు సభ్యులుగా ఉండి సేవలు అందిస్తారని ఆయన వివరించారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మహమ్మద్ షాదుల్లా, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శుభం, ప్యానల్ న్యాయవాదులు లక్ష్మీనారాయణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
