నిజామాబాద్ నగర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతుండటంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ప్రారంభమై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాకపోవడం పట్ల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు.
దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రిడ్జి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బక్కిని నర్సింలు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా మాధవనగర్ రైల్వే బ్రిడ్జిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఇప్పటివరకు సుమారు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఆగస్టు 31 లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ నిధులు విడుదల చేస్తామని కేవలం పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
ప్రకటనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో పనిలో ఎలాంటి మార్పు కనబడటం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమయానికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. 2022 జనవరి 27న ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు పలుమార్లు నిలిచిపోయాయి.
2022 సెప్టెంబర్లో మళ్లీ ప్రారంభించినా ఆశించిన వేగం లేదు. 2025 మే నాటికి పూర్తవుతాయని అధికారులు చెప్పినా ఆ గడువు దాటిపోయింది. ప్రస్తుతం 2026 ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఆ హామీలపై నమ్మకం సడలింది.
పనులు ఆలస్యం కావడం వల్ల ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కనెక్టివిటీ రోడ్డు సరిగా లేక దుమ్ము, బురదతో ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబులెన్స్లు, స్కూల్ బస్సులు సైతం ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని, దీనివల్ల ప్రజల విలువైన సమయం, ఇంధనం వృథా అవుతోందని తెలిపారు. నగర అభివృద్ధి కోసం అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును ఇకపై నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుపై పారదర్శకత కోసం ప్రతి నెలా పురోగతి నివేదికను విడుదల చేయాలని కోరారు. “ప్రజల కలల బ్రిడ్జి ఇక ఆలస్యం కాకూడదు – వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి” అనే నినాదంతో ప్రభుత్వం వెంటనే స్పందించి మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది.
అనంతరం పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ గడువులోగా బ్రిడ్జిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
