సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వివాదానికి వేదికైంది. సికింద్రాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య ప్రొటోకాల్ అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ కార్యక్రమానికి హాజరు కాకముందే చెక్కుల పంపిణీ చేపట్టడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించాయి.
ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. కొందరు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ కార్యక్రమ వేదికపై ఓడిపోయిన అభ్యర్థులు ఎలా ఉంటారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాల నాయకులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతరం పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇరువర్గాల మధ్యకు వెళ్లి వారిని నిలువరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి బయటకు పంపించారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారిన ప్రాంతంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బోనాల వంటి సంప్రదాయ కార్యక్రమంలో రాజకీయ వర్గాల మధ్య ప్రొటోకాల్ వివాదం రచ్చకు దారితీయడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
