తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదే ప్రవీణ్కుమార్ కోరారు. ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు, వాటర్ కానన్లను సైతం ఎదుర్కొని పోరాడిన వారిలో అనేకమంది ప్రస్తుతం ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పోచమ్మగల్లీలోని ముదిరాజ్వీధిలో నివాసం ఉంటున్న తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ను శనివారం ఆయన నివాసంలో ప్రవీణ్కుమార్ పరామర్శించారు. సుమారు ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన శేఖర్ పరిస్థితిని తెలుసుకున్నారు.
ఆయన కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, ఉప్పు తదితర నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్కు ధైర్యం చెప్పారు. ‘మన నీళ్లు.. మన ఉద్యోగాలు.. మన నిధులు’ అనే నినాదంతో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈర్ల శేఖర్ చురుకుగా పాల్గొన్నారని ప్రవీణ్కుమార్ తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదన్నారు. శేఖర్ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.ఉద్యమకారులకు పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు అనారోగ్యంతో ఉన్న వారికి పెద్ద ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు.తెలంగాణ సాధన కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఉద్యమకారులు నేడు దయనీయ పరిస్థితుల్లో జీవించడం బాధాకరమన్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న గత ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్లో ఉద్యమకారులకు, పేదలకు తగిన న్యాయం చేయలేదని ఆరోపించారు.
ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు కోనేరు సాయికుమార్, కరిపే రాజు, తుమ్మ నాగభూషణం, పాశుగంటి మహేష్, స్వర్గం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
