అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా శనివారం నిజామాబాద్లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి యువత, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. వెయ్యికిపైగా బైక్లతో సాగిన ర్యాలీతో నగరంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్రోడ్, వర్ని ఎక్స్రోడ్, ఖిల్లా ఎక్స్రోడ్, పవన్ టాకీస్ రోడ్డు, నెహ్రూపార్క్, బస్స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టరేట్ మైదానానికి చేరుకుంది. బీఆర్ఎస్ జెండాలు, నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని బిగాల గణేష్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు వెంటనే భరోసా కల్పించాలన్నారు.
ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలుత వేచి చూశారని గణేష్ పేర్కొన్నారు. అయితే ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల తరఫున పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చిందన్నారు.
మహిళలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారని గణేష్ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
