మార్వాడీ వ్యాపారుల విస్తరణతో స్థానిక వ్యాపారుల ఉపాధికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ మాచారెడ్డిలో శుక్రవారం వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటించారు. గజ్యానాయక్ తండా కూడలి వద్ద దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు.
వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు ఏకమై జేఏసీగా ఏర్పడి బంద్కు పిలుపునిచ్చారు.స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై ప్రభావం చూపేలా కొత్త వ్యాపారాలు విస్తరిస్తున్నాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నాణ్యత లేని వస్తువుల విక్రయంతో ప్రజలకు నష్టం కలుగుతోందని ఆరోపించారు.
మాచారెడ్డిలో కొత్తగా వ్యాపార సంస్థలకు లైసెన్సులు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు సమస్యలను వివరిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం అందజేసేందుకు వ్యాపారులు తరలివెళ్లారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
