ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని దుబ్బా ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
వివరాల్లోకి వెళితే..బాధితుడు కుటుంబ సభ్యులు వేరే ప్రాంతానికి వెళ్లారు. బాధితడు సాయి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి 3 తులాల బంగారం అపహరించి పరారయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లే సరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలను సేకరించారు. పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
