కామారెడ్డి పట్టణంలో దొంగలు హాల్ చల్ సృష్టించారు. ఒకే రాత్రి ఏకంగా ఐదు దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. తాళం వేసి ఉన్న షట్టర్లను పగులగొట్టి నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.వివరాల్లోకి వెళ్లితే.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు తమ చేతికి పనిచెప్పారు.
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా ఈ దోపిడీలు సాగాయి. నగరంలోని భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఒక జిరాక్స్ సెంటర్, ఆన్లైన్ సర్వీస్ సెంటర్, ఒక బ్యాంగిల్ స్టోర్ను లక్ష్యంగా చేసుకున్న దొంగలు..
షట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు.అలాగే కొత్త బస్టాండ్ ప్రాంతంలో ప్రియా డీలక్స్ రోడ్డులోని రెండు మొబైల్ షాపుల్లోనూ దొంగతనాలు జరిగాయి. అక్కడ ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్లతో పాటు నగదును అపహరించారు.
శుక్రవారం ఉదయం యజమానులు తమ దుకాణాలను తెరిచేందుకు రాగా, షట్టర్లు పగులగొట్టి ఉండటం చూసి విస్తుపోయారు. ఈ ఐదు దుకాణాల్లో కలిపి సుమారు రూ. 5 లక్షల నగదు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
