విద్యా కుసుమాలు వికసించాల్సిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక, నాసిరకం భోజనంతో విద్యార్థినులు నరకయాతన అనుభవిస్తున్నారు.
హాస్టల్లో విద్యార్థినులకు పెడుతున్న భోజనం అత్యంత దారుణంగా ఉంటోంది. ఈ మేరకు పాఠశాలలోని దుస్థితిపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ శుక్రవారం హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు ఉంటున్నా, సిబ్బంది వాటినే వండుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం తినలేక సగం కడుపుతోనే గడపాల్సి వస్తోందని కన్నీరు మునిగారు. దీనికి తోడు పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తాగేందుకు వాడుతున్న నీరు సైతం కలుషితం కావడంతో విద్యార్థినులు వరుసగా రోగాల బారిన పడుతున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి..
అడిగితే పట్టించుకునే వారు లేరు” అంటూ ఆయన ముందు ఆవేదన వెళ్లగక్కారు. నిల్వ ఉంచిన బియ్యాన్ని, నీటి సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదని అధికారులను హెచ్చరించారు.
చిన్న పిల్లలకు కనీసం నాణ్యమైన భోజనం, సురక్షితమైన తాగునీరు అందించలేని స్థితిలో యంత్రాంగం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు.
