అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణానికి చెందిన మామిడిపల్లి సాగరికకు, అదే పట్టణానికి చెందిన రవికాంత్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన కొన్ని ఏళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది.
అయితే, గత ఐదేళ్లుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. పుట్టింటి నుంచి అదనంగా రూ. 20 లక్షలు తీసుకురావాలని సదరు కుటుంబ సభ్యులు సాగరికపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
ఈ క్రమంలో వారి వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో, మనస్తాపానికి గురైన సాగరిక గురువారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి తమ్ముడు సాయికృష్ణ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తన అక్క మరణానికి భర్త, అత్తమామల వేధింపులే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.
