వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్త అని చూడకుండా, ప్రియుడితో కలిసి పథకం వేసి గొంతు నులిమి చంపిన ఉదంతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందపేటలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లాకు చెందిన బూసవెల్లి దుర్గయ్య (36), తండ్రి విఠల్, వృత్తిరీత్యా కూలీ. ఇతను తన భార్య మంజులతో కలిసి బతుకుదెరువు కోసం ఆర్మూర్ మండలంలోని గోవిందపేట గ్రామానికి వలస వచ్చి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడనీ తెలిపారు.
మృతుడి భార్య మంజులకు సంజీవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరి వ్యవహారం భర్త దుర్గయ్య కంటపడటంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మంజుల, ప్రియుడు సంజీవ్తో కలిసి భర్తను హతమార్చేందుకు మంజుల వ్యూహం రచించింది.
నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో, దుర్గయ్య నిద్రిస్తున్న వేళ ప్రియుడితో కలిసి అతడిపై దాడి చేసింది. ఇద్దరూ కలిసి దుర్గయ్య గొంతు నులిమి కిరాతకంగా ప్రాణాలు తీశారని అన్నారు.మృతుడి సోదరి బంటు విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
తన అన్నను వదిన మంజుల, ఆమె ప్రియుడు సంజీవ్లు కలిసి హత్య చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు
