దిక్కులేని వారికి తామున్నామంటూ ఆత్మీయతను చాటుతున్నారు నిజామాబాద్కు చెందిన ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. అనాథ శవాలకు ఆత్మబంధువులై అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
గురువారం నగరంలోని దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో ఇద్దరు గుర్తు తెలియని వృద్ధుల మృతదేహాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు గుర్తు తెలియని వృద్ధుల మృతదేహాలు ఆసుపత్రిలో ఉన్నాయి.
వీరి వివరాలు తెలియకపోవడంతో, అంతిమ సంస్కారాలు నిర్వహించాలని 1వ టౌన్, 3వ టౌన్ పోలీసులు ఇందూరు యువత సంస్థను కోరారనీ అన్నారు. పోలీసుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన సంస్థ సభ్యులు, ఆ వృద్ధులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సేవా కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, సభ్యులు మద్ది గంగాధర్, ఇందూరు శేఖర్, దర్శనం రాజు, అలాగే యూవీ ఫౌండేషన్ ప్రతినిధి సతీష్, 1వ టౌన్ పోలీస్ సిబ్బంది రాహుల్, 3వ టౌన్ పోలీస్ సిబ్బంది శశాంక్ తదితరులు పాల్గొని మృతదేహాలకు వీడ్కోలు పలికారు.
మృతి చెందిన వారికి ఎవరూ లేకపోయినా, ఒక కుటుంబ సభ్యుడిలా భావించి అంత్యక్రియలు నిర్వహించిన యువతను పలువురు అభినందించారు.
