నిజామాబాద్ జిల్లాలో సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో అప్పుడే అగ్నిగుండంలా మారింది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఇందూరు వాసులు బెంబేలెత్తిపోతున్నారు.. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలవుతుండటంతో జిల్లా జనం అల్లాడిపోతున్నారు.
మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలు.. ఆర్మూర్ నుంచి బోధన్ వరకు, నిజామాబాద్ నగరంలోని ప్రధాన చౌరస్తాలన్నీ వెలవెలబోతున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్న రోడ్లపై వాహనదారులు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సోమవారం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C గా నమోదైనప్పటికీ, బయట తిరుగుతున్న వారికి అది 38°C నుంచి 40°C ఎండ తీవ్రతను తలపిస్తోంది.అదే అదును చూసి వ్యాపారులు కొబ్బరి నీళ్లు, శీతల పానీయాల ధరలను అడ్డగోలుగా పెంచేయడం గమనార్హం.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే!
ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు టోపీలు, గొడుగులు ధరించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని కోరుతున్నారు.
