కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆరోపించారు. ఆటో కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఒక్కో ఆటో డ్రైవర్కు రూ.36 వేల వరకు బకాయి పడిందని, వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆరోపించారు.
వారికి పరిహారం అందిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. కేసీఆర్ హయాంలో ఆటోలు, ఇతర రవాణా వాహనాలకు రోడ్డు పన్ను నుంచి మినహాయింపు ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం ఆ సదుపాయాలను పక్కనబెట్టి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిగాల అన్నారు.
పింఛన్ల పెంపు, ఇద్దరికి పింఛన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.నిజామాబాద్ నగరంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.
హైమదీ బజార్లో నిర్మించిన నూతన మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య సమస్యలు నెలకొని దుర్గంధం వెదజల్లుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళల సమస్యలపై ధర్నాలు, బైక్ ర్యాలీలు నిర్వహించామని, తాజాగా ఆటో కార్మికుల సమస్యలపై ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని బిగాల పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి,చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.
