జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ‘చీత ఫోర్స్’ బృందాలు ఉక్కుపాదం మోపాయి.
ఆదివారం జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ఆదేశాల మేరకు వెల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా ఇసుకను తరలిస్తున్న ఓ లారీ పట్టుబడింది.
జిల్లాలో సహజ వనరుల దోపిడీని అరికట్టడంతో పాటు, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సీపీ సాయి చైతన్య ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ నేతృత్వంలోని చీత ఫోర్స్ సిబ్బంది వెల్పూర్ పరిధిలో మెరుపు తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, అనధికారికంగా ఇసుకను తరలిస్తున్న 14 టైర్ల భారీ లారీని పోలీసులు గుర్తించి, చాకచక్యంగా పట్టుకున్నారు.లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వాహనాన్ని వెల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని, సహజ వనరుల సంరక్షణకు చీత ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. అక్రమార్కులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
