వినాయక విగ్రహం కొనుగోలు వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసి ఓ వ్యక్తి మృతికి కారణమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. చౌదరిగూడకు చెందిన కొందరు వ్యక్తులు వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్లకు వెళ్లారు.
విగ్రహాల విక్రయదారులతో ధర, కొనుగోలు విషయమై మాటామాటా పెరిగింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలో చౌదరిగూడకు చెందిన కిరణ్ (34)పై విక్రయదారుల్లో కొందరు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన కిరణ్ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన చోగారామ్ కూడా ఘర్షణలో గాయపడినట్లు తెలిసింది.
జాతీయ రహదారిపై ఆందోళన
కిరణ్ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
