స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. వేడుకల అనంతరం స్నేహితులతో కలిసి కారులో కోకాపేటకు బయలుదేరిన కాసేపటికే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో కూకట్పల్లికి చెందిన మదన్మోహన్రెడ్డి (17) మృతి చెందగా.. కారులో ఉన్న మరో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. కోకాపేట నియోపొలిస్ వ్యూపాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మదన్మోహన్రెడ్డి ఇంటర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు మరో స్నేహితుడికి చెందిన ఇన్నోవా కారులో వెళ్లాడు. వేడుకలు ముగిసిన అనంతరం స్నేహితులతో కలిసి కోకాపేట వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో నియోపొలిస్ వ్యూపాయింట్ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.ప్రమాద తీవ్రతకు మదన్మోహన్రెడ్డి కారు డోరు నుంచి బయటకు వచ్చి సమీపంలోని స్తంభాన్ని ఢీకొన్నాడు.
తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన విద్యార్థులు మద్యం సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.
ప్రమాదానికి అతివేగమే కారణమా.. లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
