ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ మూడో లిఫ్టును సందర్శించారు.
ఎస్ జె ఆర్ పిఆర్ఎల్ఐఎస్ ( పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్) లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
2020- 2023 సంవత్సరం నాటికి రూ 3300 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేయగా, 2023వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ. 800 కోట్లను ఖర్చుచేసి ప్రాజెక్ట్ పనులను కొనసాగించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న మిగతా సివిల్ పనులను రూ.90 కోట్లతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఇక్కడ మొత్తం 10 పంపులు ఉండగా 5 పంపులను ఫిట్ చేసి ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్ కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామన్నారు.
ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం ద్వారా విడతల వారీగా రిజర్వాయర్ ను నింపడం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12 లక్షల ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. .
