డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తోన్న రాము నాయక్ ని సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.ప్రకటించారు ఆయన 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్పై హౌజింగ్ బోర్డులో భూ సేకరణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ సమయంలో అనేక భూ దందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో తక్షణమే రామునాయక్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. హైదరాబాద్, క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కోసం హౌజింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్న సమయంలో రాము నాయక్ భూ లీలలు బయటకు వచ్చాయన్నారు.
బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైగా విలువ చేసే హై కోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌజింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాల స్థలాన్ని రామునాయక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు బయటపడిందన్నారు. దీనిపై లోతైన విచారణ జరుపగా రాము నాయక్ భూ దందాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
రాము నాయిక్ హౌజింగ్ బోర్డు ఎల్ఏవోగా, బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేసి ఉద్యోగం నుంచి తొలగింపబడిన ఇఫ్తాకర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ డబ్బులు కూడా నేటి వరకు బోర్డుకు జమ కాలేదన్నారు.
ఈ భూమికి సంబంధించిన పత్రాలను బోర్డు అనుమతులను పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్ పై కూడా విచారణకు ఆదేశించామన్నారు.
కాల క్రమంలో 2025 ఏప్రిల్ లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ప్రభుత్వ పరంగా తగు విచారణ జరిపిస్తున్నామన్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా రాము నాయక్ అక్రమాలు ఒక్కొక్కటి బయట పడ్డాయన్నారు.
