జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఏటీఎం దొంగతనాలు, భద్రతా వైఫల్యాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు కష్టపడి దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, క్యాష్ సప్లై ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ‘సమన్వయ – భద్రత సమీక్షా సమావేశం’ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఏటీఎం కేంద్రాల వద్ద కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం లావాదేవీలు జరపడమే కాకుండా, భద్రత విషయంలోనూ బ్యాంకులు అంతే బాధ్యతగా ఉండాలని సూచించారు.
ప్రతి ఏటీఎం సెంటర్లో హై-క్వాలిటీ సీసీటీవీ కెమెరాలు ఉండాలి. వాటి రికార్డింగ్ కనీసం 30 రోజుల పాటు భద్రంగా ఉండేలా చూడాలి. ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగితే వెంటనే సైరన్ మోగేలా సెన్సార్లతో కూడిన అలారం వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
రాత్రి సమయాల్లో కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. సరైన వెలుతురు (లైటింగ్) లేని ఏటీఎంలపై కఠినంగా వ్యవహరిస్తాం. క్యాష్ లోడింగ్ చేసే సమయంలో ఏజెన్సీలు ఏటీఎం పరిసరాలను నిశితంగా గమనించాలనీ అన్నారు.
ఏవైనా సాంకేతిక లోపాలు లేదా అనుమానాస్పద మార్పులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు. నేరగాళ్ల వ్యూహాలను చిత్తు చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం గస్తీ నిర్వహిస్తోందని, దీనికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీపీ తెలిపారు.
ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు తచ్చాడుతుంటే వెంటనే ‘డయల్ 100’ లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ఆస్తి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్)బస్వా రెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, వై. వెంకటేశ్వర్ రావ్ (సైబర్ క్రైమ్), మస్తాన్ అలీ (ట్రాఫిక్), లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ జిల్లాలోని పలువురు బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.
