భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అదనపు డి.ఎం.ఇ. డాక్టర్ ఎన్. కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి అంబేద్కర్ వేసిన పునాదులే నేడు దేశ ప్రగతికి బాటలు వేస్తున్నాయని కొనియాడారు.
అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం అనే ఆదర్శాలను నిత్య జీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి, అడ్మిన్ సూపరింటెండెంట్ పెద్దొల్ల నాగరాజు, వైద్య కళాశాల పరిపాలనా సిబ్బంది, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్కు అంజలి ఘటించారు.
