ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు.
ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని చెప్పారు.
మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పుష్టిగా లభిస్తుంది అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని గుర్తు చేశారు. మిషన్ లైఫ్ పేరుతో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, నీటి సంరక్షణ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం విరివిగా కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే అనేకమంది మోదీ పిలుపును పాటిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్, నాయకులు మాయావార్ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
