నిజామాబాద్ నగరంలో రేపు జరగబోయే ఊర పండగకు సర్వం సిద్ధమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వడ్ల దాతి నుంచి అమ్మవారి విగ్రహాలు ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలు మైసమ్మ గద్దెవద్దకు చేరుకుంటాయి.
వతన్ దార్లు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తల్లుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ పండుగను నిజామాబాద్ లోని 12 ప్రాంతాలలో కొలువై ఉన్న 14 గ్రామ దేవతలను పూజిస్తూ జరుపుకుంటారు.
ప్రతి ఏటా మామిడి కర్రతో కొత్త ప్రతిమలను తయారు చేస్తారు. ఊరపండుగకు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలను కొండెంగా హనుమాన్, అశోక్ విధిలో లోని వడ్లధాతి వద్ద వతాన్దాదార్ల పర్యవేక్షణలో అమ్మవార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ఈ ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊర పండుగను జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకుంటున్నారు.
గ్రామ దేవతలైన సార్గమ్మ (2 విగ్రహాలు), బోగంసాని, కొండలరాయడు, బండి, రాట్నం, ఆసు, పెద్దపులి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, అంపుడు పోచమ్మ ప్రతిమలు ఒకటి చొప్పున ఉంటాయి.
వీటిని సరి గంపలతో ఘనంగా ఊరేగిస్తారు. ఈ ఊర పండగ నగరంలోని ఖిల్లా ప్రాంతం నుంచి దేవతా విగ్రహాలను ఊరేగించనున్నారు. ఊర పండగలో పవిత్ర ప్రసాదంగా భావించే సరిని నగరం నలుమూలల జల్లుతూ చెరువులో కలుపుతారు.
ప్రత్యేకమైన కర్రతో తయారుచేసిన అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలు మైసమ్మ గద్దె, శారదాంబ గద్దే వద్ద అమ్మవార్లకు పసుపు కుంకుమ గులాలు పట్టు వస్త్రాలతో చెవి పోగులు గాజులతో నగర పెద్దలు అలంకరించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచే వేడుకలను ప్రారంభిస్తారు.
అనంతరం దేవత మూర్తులతో శోభాయాత్రగా బయలుదేరి గాజుల పేట్ చౌరస్తా మీదుగా పెద్ద బజార్ చౌరస్తా వరకు చేరుకుంటారు. పెద్ద బజార్ చౌరస్తా నుంచి రెండు భాగాలుగా విడిపోయి ఒక బృందం పోకాలమ్మ అడేల్లి పోచమ్మ, నల్ల పోచమ్మ, రాట్నం, తొట్లే లతో దుబ్బ వైపుగా వెళ్తుంది.
రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా, పూలన్ చౌరస్తా మీదిగా వినాయక్ నగర్ లోని ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు తోట్లెలతో చేరుకుంటుంది.
గ్రామదేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి, పాడిపంటలు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని, ఏటా ఆషాఢ మాసంలో ఊర పండుగ జరుపుకుంటారు.
