ట్రాఫిక్ నిబంధనల విషయంలో సామాన్య ప్రజలకు అవగాహనా అనివార్యమని అందుకే అవగాహనా ఆతర్వాతే జరిమానాలు వేస్తామని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ అన్నారు దిగువ మధ్యతరగతి ప్రజలను జరిమాణాలతో నష్టం కలిగించే ఉద్దేశ్యం తమకు వుండదన్నారు .
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిత్యం వాహనాలతో రద్దీ ఏర్పడుతుంది. ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించి ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారులలో మార్పులు రావడం లేదు. యదేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా మైనర్ యువత వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ వంటి అనేక రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి విషయాలలో పట్టబడి కేసులు నమోదైతే వారి భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదనీ పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా కూడా విధిస్తున్నామని అన్నారు.
ట్రాఫిక్ జరిమానా విధించడంతో కొందరు మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక స్తోమతపై ప్రభావం చూపుతుందని వారికి వచ్చే రూపాయలు జరిమానా కట్టడానికే సరిపోతున్నారని, కానీ ఇక నుంచి వారిని దృష్టిలో పెట్టుకొని ఒకే సారి జరిమానాలు విధించకుండా వాహనదారులకు కౌన్సిలింగ్ లు నిర్వహించి, అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
దీంతో ఇప్పటి నుంచి కళాశాలలు, పాఠశాలలతో పాటు వివిధ ప్రధాన కూడళ్ళ వద్ద నిత్యం ట్రాఫిక్ పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా వందల సంఖ్యలో మందుబాబులు పట్టుబడడం పరిస్థితికి అద్దంపడుతోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నగర వ్యాప్తంగా ప్రతి రోజు చేపడతామని, పట్టుబడితే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని పోలీసులు ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. మైనర్లు దొరికారంటే జరిగేది ఇదే..
18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వాహనం నడపడం చట్టవిరుద్ధం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు ఏడాది పాటు లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాకుండా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవకాశం ఉండదు.మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయవచ్చు. కాబట్టి, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, మైనర్ల డ్రైవింగ్ను ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు..నగరంలో వాహనాలు నడిపే వారిలో మార్పు రావాలి. రోడ్లపై సురక్షితంగా ప్రయాణించాలి. ఇందుకోసం ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి. విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘణలకు పాల్పడి వారిపై కేసులు నమోదైతే వారి భవిష్యత్ ప్రమాదంలో పడవచ్చు.
విదేశాలకు వెళ్లే సమయంలో, ఉద్యోగాల సమయంలో కేసులు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది గుర్తుంచుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదని తరచుగా పోలీసులు హెచ్చరిస్తున్నా కొంత మందిలో మార్పురావడం లేదు.
అలాంటి వారిలో మార్పు రావాలి. ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల కోసమేననేది తెలుసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.