- నందిపేట్ మండలం కొండూరు కేంద్రంగా కొనసాగుతున్న మట్టి దందా
- మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణలతో చెలగాటం
- పట్టించుకోని అధికారులు
జాన రమేష్: ఇది సంగతి :ఆర్మూర్:
యదేచ్చగా నల్ల మట్టిని తరలిస్తూ పచ్చని ప్రకృతి వనరులకు గండి కొడుతున్నారు అక్రమార్కులు. ఈ అక్రమ దందాకు అధికారుల అండ తోడు కావడంతో నల్లమట్టి దందా మూడు ట్రాక్టర్లు… ఆరు టిప్పర్లుగా విరాజిల్లుతుంది. మితిమీరిన వేగంతో భారీ వాహనాలను నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్న సంబంధిత శాఖ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారు.
నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు శివారులోని గోదావరి పరివాహక ప్రాంతాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది సంఖ్యలో నల్ల మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి దిగుబడి సాధించేందుకు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో నల్ల మట్టిని రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు నల్లమట్టి దందాకు తెరలేపి అక్రమ సంపాదనకు ఆజ్యం పోస్తున్నారు. నందిపేట్ మండల పరిధిలో ఉన్న ఆయా గ్రామాలలో సబ్ ఏజెంట్లను నిర్వహించుకుని నిత్యం వందలాది టిప్పరులతో మట్టిని తరలిస్తున్నారు.
గత వారం రోజులుగా 24 గంటల పాటు అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.గత అదివారం సిహెచ్ కొండూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు మితిమీరిన అతివేగంతో నల్ల మట్టిని తరలిస్తున్న ఈ తిప్పర్లు ఢీకొనడంతో నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం. దీనిపై స్థానిక గ్రామస్తులు సిహెచ్ కొండూరు ప్రధాన రహదారిపై తిప్పర్లకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి అక్రమ మట్టి దందాను రాస్తారోకో చేసి అడ్డుకున్నారు.
ఈ విషయమై నందిపేట్ తాసిల్దార్ ఆనంద్ కుమార్ వివరణ కోరగా అక్రమ మట్టి దండ తమ దృష్టికి రాలేదని, అది ఇరిగేషన్ పరిధిలోకి వస్తుందని వివరించారు. ఇదే విషయం ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ ను వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని, అక్రమంగా తరలిస్తున్న మట్టి దందాపై చర్యలు తీసుకుంటామని ఒకసారి, మరోసారి అది రెవెన్యూ పరిధిలోకి వస్తుంది, తాము ఏమి చేయలేమని దాటవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు ఈ మట్టి దందాపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు




