–అబద్ధాలు, అంకెలగారడీ, కట్టుకథల బోగస్ బడ్జెట్
–ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిన భట్టి వట్టిమాటలు
–అభివృద్ధికి పాతర, అవినీతి జాతర
–స్కీమ్ లకు ఘోరీ, తెలంగాణ సంపద చోరీ
–బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మార్చి20:–
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయని గ్యారెంటీలు అర డజన్ అని, నమ్మి ఓట్లేసిన జనాన్ని ముంచుడే కాంగ్రెస్ విజన్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్
అబద్ధాలు, అంకెలగారడీ, కట్టుకథల బోగస్ పద్దు అని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ లో భట్టి వట్టిమాటలు
ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని జీవన్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని ఆయన తెలిపారు. దివ్యాంగులకు బాకీ పడ్డ రూ.54,000,
నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఊసే లేదని ఆయన విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ.24,000లో, సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు సంవత్సరాలుగా బాకీ ఉందన్నారు.
ఈ బడ్జెట్ లో స్కీమ్ లకు ఘోరీ కట్టి,స్క్యామ్ లకు తెర లేపారని ఆయన ఆరోపించారు.
బీసీలకు నిధులు కేటాయించకుండా వారి గొంతు కోశారని, కళ్యాణ లక్ష్మీతో తులం బంగారం వస్తుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశకు గురి చేశారని,
జీవన్ రెడ్డి పేర్కొంటూ
ఈ బడ్జెట్ చూసిన తర్వాత ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందన్నారు.
దళితులకు కేటాయించే బడ్జెట్ ను కుదించారని,
బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారని,
వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.54,000 బాకీ సంగతి ప్రస్తావన లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని, అభివృద్ధి కి పాతరేసి, అవినీతి జాతరకు తెరదీశారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
