రైతాంగ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాలు రైతుల కోసం కేటాయించిన నిధులను ‘స్వాహా’ చేసే కేంద్రాలుగా మారాయి. వేల్పూరు మండలం పడగల్ గ్రామ సొసైటీలో భారి నిధుల గోల్ మాల్ ‘దయాసాగర’ ‘మోహన’ రంగా అన్న చందనంగా తయారైంది పరిస్థితి .
గతంలో సంవత్సరాలు తిష్ట వేసుకొని సహకార నిధులను సొంతానికి మళ్ళించుకోవడంలో సిద్ధహస్తుడిగా ఆయనకు పేరు ఉంది. ఆయనకు తోడుగా నేనేమి తీసుపోనన్నట్టుగా ప్రస్తుత కార్యదర్శి వ్యవహారం ఉందంటూ రైతులు పెదవి వివరిస్తున్నారు.
పడగల్ సొసైటీ పరిధిలో పడగల్ , అంక్సాపూర్, పోచంపల్లి , అంక్సాపూర్ , కోమన్ పల్లి గ్రామాలు ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాలకు పైగా ఈ సహకార సంఘంలో వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన దయాసాగర్ కార్యదర్శిగా విధులు నిర్వహించాడు.
అయితే గత నాలుగు సంవత్సరాల కిందట దయాసాగర్ బదిలీపై కొలిప్యాక సొసైటీకి కార్యదర్శిగా వెళ్ళాడు. ఆయన తర్వాత ప్రస్తుత కార్యదర్శి గా మోహన్ కొనసాగుతున్నారు.
కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో … గత కొన్ని సంవత్సరాలుగా సహకార సంఘంలో తిష్ట వేసుకున్న అవినీతి, ఒక్కొక్కటిగా అవినీతి పుట్టలో నుంచి వెలుగులోకి వస్తున్నాయి.
తాము రుణము తీసుకోకపోయిన… తమ పేరిట రుణం మంజూరు చేసినట్టు సొసైటీ రికార్డులలో తమ పేరును చూసిన రైతులు నివ్వెరపోతున్నారు. పడగెల గ్రామానికి చెందిన రాహుల్ అనే యువరైతు తాను లోన్ పొందకపోయినా 1,20,000 రుణం తన పేరిట మంజూరు అయిందని వాపోయాడు.
అలాగే అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల చిన్న రాజేశ్వర్ కు సంబంధించి , ఇద్దరు కుటుంబ సభ్యుల పేరట తల లక్ష రూపాయల లోను ఉన్నట్టుగా సొసైటీ రికార్డులు తెలుపుతున్నాయి.
అయితే తాము లోను తీసుకోకుండానే తమకు లోను ఇచ్చినట్టు ఎందుకు రికార్డు చేశారని అధికారులను ప్రశ్నిస్తే… మౌనమే అక్కడి నుండి సమాధానంగా వస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో రైతుల రుణమాఫీ నిధులు గోల్మాల్ అయినట్టు తెలుస్తోంది. దీంతోపాటు సహకార సంఘ నిధులను ఇప్కో, క్రిబ్కో ఎరువుల కంపెనీలకు సుమారు 40 లక్షలు, గతంలో 1996 నుండి 97వ సంవత్సర మధ్యలో డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది.
ఆ మొత్తం నిధులలో నుండి వచ్చే 20% డివైడెడ్ ఫండ్ ద్వారా సహకార సంఘ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేవారు. ప్రస్తుతం ఆ డిపాజిట్లు మొత్తం ఆయా కంపెనీల నుండి కరిగి ఆవిరైపోయినట్టు తెలుస్తోంది.
వీటితోపాటు రైతులు తీసుకున్న రుణ మాఫీపై సమకూడే వాట ధనం నిధులు కుడా స్వాహా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై రైతులు తమ వాటాదనం డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరితే, తర్వాత ఇస్తామని చేతులెత్తేస్తున్నారని రైతులు అంటున్నారు.
ఈ అవినీతి అక్రమాలపై వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి గత నెల క్రితం జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై స్పందించిన కలెక్టర్ విచారించేందుకు విచారణ అధికారిగా మురళిని నియమించి, సదరు అక్రమాలపై విచారణ దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ అధికారి మురళి సొసైటీ రికార్డులను అందజేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. విచారణలో స్థానిక సెక్రటరీ మోహన్ తో పాటు మాజీ కార్యదర్శి ఎలా సహకరిస్తారో వేచి చూడాల్సిందే.
