రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. శనివారం ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది.
ఈ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇందులో 38 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన సర్పంచ్ స్థానాలకు 587 మంది అభ్యర్థులు గట్టి పోటీకి సై అన్నారు. ధర్పల్లి 6, డిచ్ పల్లి 7 , ఇందల్వాయి 4, జక్రాన్పల్లి 3, మాక్లూర్ 7, మోపాల్ 1,నిజామాబాద్ రూరల్ 4, సిరికొండ 6 మొత్తం 38 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
దీంతో ఆయా గ్రామాల్లో హోరాహోరీ పోరు అనివార్యమైంది. అలాగే, మొత్తం 1760 వార్డు మెంబర్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, అత్యధికంగా 674 స్థానాలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
ధర్పల్లి 86, డిచ్ పల్లి 131, ఇందల్వాయి 95, జక్రాన్పల్లి 64, మాక్లూర్ 87, మోపాల్ 57,నిజామాబాద్ రూరల్ 64, సిరికొండ 90 మొత్తం 674 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1082 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
బరిలో కొలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి.
