దళిత స్పీకర్పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్గౌడ్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి గౌరవాన్ని కించపరిచేలా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాత మధు తక్షణమే క్షమాపణ చెప్పాలని, శాసన మండలి నిబంధనల ప్రకారం ఆయనపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.కులపరమైన, అవమానకర వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని మహేష్కుమార్గౌడ్ అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత అవమానాలకు పాల్పడటం సరికాదన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ ఘటనపై స్పందించాలని మహేష్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. తాత మధు చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు స్పీకర్కు, దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. శాసన వ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
