కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు. ఎన్నికల సమయంలో బడ్జెట్, ఆర్థిక పరిస్థితులను పట్టించుకోకుండా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు.సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గణేష్ బిగాల మాట్లాడారు. రూ.2 వేలుగా ఉన్న పింఛన్ను రూ.4 వేలకు పెంచడంతో పాటు ఇంట్లో ఇద్దరికి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును విస్మరించారని విమర్శించారు.గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని గణేష్ బిగాల అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై శాంతియుతంగా నిరసనలు చేపట్టినట్లు తెలిపారు.
420 హామీల ఫ్లెక్సీల ప్రదర్శన, ధర్నాలు, బైక్ ర్యాలీలు, ఇతర నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామికమని గణేష్ బిగాల అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజాత లక్ష్మారెడ్డిపై పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్లోకి భారీగా చేరికలుకాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇతర పార్టీల నాయకులు సైతం బీఆర్ఎస్ వైపు వస్తున్నారని గణేష్ బిగాల తెలిపారు. ప్రతిరోజూ పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సుజిత్సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.
