రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, వరదలు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే రోగులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో సోమవారం ‘ఫ్లడ్ మాక్ డ్రిల్’ (కృత్రిమ విన్యాసం) అత్యంత విజయవంతంగా నిర్వహించారు.
విపత్తు సమయాల్లో ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ పిలుపు మేరకు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఈ విన్యాసాలు జరిగాయి.ఇన్సిడెంట్ కమాండ్ సిస్టమ్ (ఐసీఎస్) ఇన్చార్జ్, నిజామాబాద్ ఆర్డీఓ కె. రాజేంద్ర కుమార్ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రాక్టికల్గా నిరూపించారు. ఒకవేళ భారీ వరదల వల్ల ఆసుపత్రిలోకి నీరు చేరితే, వార్డుల్లో ఉన్న రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటం, వివిధ విభాగాల మధ్య వేగంగా కమ్యూనికేషన్ నిర్వహించడం, ప్రాణనష్టం జరగకుండా తక్షణ నిర్ణయాలు తీసుకోవడంపై ఆసుపత్రి సిబ్బంది అద్భుతమైన సిద్ధతను ప్రదర్శించారు. ఈ విపత్తు నిర్వహణ విన్యాసాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బందితో పాటు ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు చురుగ్గా పాల్గొన్నారు.
అలాగే ఎన్సీసీ కెడెట్లు, ఆపద మిత్ర వాలంటీర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పరస్పర సమన్వయంతో రంగంలోకి దిగి అత్యవసర సహాయక చర్యలను చేసి చూపించారు.జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసాల్లో డా. రాజశేఖర్, డా. సరస్వతి, నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, ఆసుపత్రి సిబ్బంది, 108 బృందం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ మాక్ డ్రిల్ ద్వారా భవిష్యత్తులో వచ్చే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతమైందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
