మోర్తాడ్ మండలం తాజా మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్ మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అడుగుజాడల్లో నడిచి ఆయన చేస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడానికి..
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. శివలింగు శ్రీనివాస్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శిష్యుడిగా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి అప్పట్లో మోర్తాడ్ ఎంపీటీసీగా విజయం సాధించారు. 2019-24 సంవత్సర కాలంలో మోర్తాడ్ ఎంపీపీ గా మండలానికి ఎన్నో సేవలు అందించారు. మోర్తాడ్ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు తన వంతు కృషి చేశారు.
మోర్తాడు మండలం ఉత్తమ మండలంగా ముందు ఉంచడంలో ఎంపీపీగా శివలింగు శ్రీనివాస్ తన వంతు కృషి చేశారు. మోర్తాడ్ మండలాన్ని ఉత్తమ మండలంగా తీర్చిదిద్దినందుకు గాను అవార్డును సైతం అందుకున్నారు.
అలాగే 2024 సంవత్సరంలో ఆయన చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
మోర్తాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు అందుకుంటూ బలోపేతం అవుతుందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
