జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల అన్నదాతలు రోడ్లపాలవుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి మండిపడ్డారు.
బుధవారం నాడు వారు ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారిని కలిసి జిల్లాలోని రైతాంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దినేష్ పటేల్ గారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు.
మిగిలిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్ల మీద ఎండకు ఎండుతోంది. జిల్లాలో 42 – 43 డిగ్రీల ఎండల కారణంగా ధాన్యంలో తేమ తగ్గి, బరువు గణనీయంగా తగ్గుతోంది. 40 కిలోలు తూగాల్సిన బస్తా 35 కిలోలకే వస్తుండటంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు.
సన్న వడ్లు నూకలయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7,000 కేంద్రాలు తెరిచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో 2,800 కూడా సరిగ్గా పనిచేయడం లేదు. హమాలీలు ఉంటే తూకం ఉండదు, తూకం ఉంటే ట్యాగింగ్ ఉండదు, ట్యాగింగ్ ఉంటే లారీలు రావు.
లారీలు మిల్లులకు వెళ్తే ధాన్యం దించుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకులు మిల్లర్లకు ఫోన్ చేసి బతిమిలాడాల్సిన దుస్థితి రావడం ఈ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనడానికి నిదర్శనం. రెండు నెలల ముందే పూర్తి కావాల్సిన కంప్యూటర్ ట్యాగింగ్ పనులు ఇప్పుడు చేస్తుండటం వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన కొనుగోలు వేగవంతం చేయాలి.
రైస్ మిల్లర్లతో ఉన్న సమస్యలను పరిష్కరించి, తేమ మరియు బరువు తగ్గుదల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని దినేష్ పటేల్ హెచ్చరించారు.
