నగరంలో చైన్ స్నాచర్లు హల్చల్ సృష్టించారు.గురువారం ఉదయం కేవలం గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేయడం నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది.దుండగులు పక్కా స్కెచ్తో నగరంలోని వివిధ కాలనీలను లక్ష్యంగా చేసుకున్నారు:నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో తెగబడ్డారు.
ఉదయం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందున్న ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును క్షణాల్లో తెంచుకుని బైక్పై పరారయ్యారు.ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అయితే తొలుత ఈ దుండగులు నగరంలోని మూడో టౌన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలోని అరబిందో స్కూల్ సమీపంలో వాకింగ్ చేస్తున్న ఓ మహిళను దొంగలు టార్గెట్ చేశారు. బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. అయితే, సదరు మహిళ అప్రమత్తమై తన గొలుసును గట్టిగా పట్టుకుని ప్రతిఘటించడంతో దొంగల ప్రయత్నం విఫలమైంది.అక్కడి నుంచి తప్పించుకున్న దుండగులు నేరుగా గాయత్రీనగర్కు చేరుకున్నారు. అక్కడ కూడా మరో మహిళపై చైన్ స్నాచింగ్కు యత్నించి విఫలమయ్యారు.
వరుసగా రెండు చోట్ల విఫలమైనా వెనక్కి తగ్గని దొంగలు.. చివరగా శ్రీనగర్ కాలనీకి చేరుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాలను సందర్శించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న నాలుగో టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
