ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. అలాంటి విషాదాలు జరగకూడదంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు భద్రత అంశంలో ఇతరులను చైతన్య పరిచే అంబాసిడర్లుగా మారాలి” అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘అరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరంలోని విజయ హైస్కూల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమీషనర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాల పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా విద్యార్థులు తమ తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని ప్రోత్సహించాలని కోరారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఎస్.హెచ్.ఓ. పి.ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాదేవి, ఉపాధ్యాయులు సుజాత, వసంత, విద్యార్థులు పాల్గొన్నారు.
