ఇందూర్ జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్రలకు పోలీసు యంత్రాంగం ఆటంకాలు సృష్టించడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. నిబంధనల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి జిల్లా పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో కంటేశ్వర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదని, ఇందులో లక్షలాది మంది భక్తులు, మహిళలు శాంతియుతంగా పాల్గొంటారని దినేష్ కులచారి గుర్తు చేశారు.
వేకువజామున 3 గంటల నుంచే సారంగాపూర్ హనుమాన్ మందిరానికి వేలాది మంది భక్తులు తరలివెళ్లడం ఇక్కడి ఆనవాయితీ అని వివరించారు. దశాబ్దాలుగా ఎంతో ప్రశాంతంగా సాగుతున్న ఈ ఉత్సవాలను ప్రస్తుత సంవత్సరం వివిధ కారణాలు చూపుతూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం భావ్యం కాదన్నారు.
శాంతియుత ర్యాలీలకు ఆంక్షలు విధించడం కంటే, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించడంపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలని ఆయన సూచించారు. “హనుమాన్ జన్మదినోత్సవ ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతాయి.
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, స్థానిక పోలీసులతో మాట్లాడి ర్యాలీలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి” అని దినేష్ కులచారి కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
