నగర పాలనలో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. తాజాగా ఎన్నికైన కార్పొరేటర్లు ‘అధికారం అంటే కుర్చీ కాదు.. బాధ్యత’ అని నిరూపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచే రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు పూర్తిస్థాయిలో డివిజన్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇన్నాళ్లూ ఫైళ్లకే పరిమితమైన సమస్యలకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిష్కారం లభిస్తోంది.
పదవీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే కొత్త కార్పొరేటర్లు బస్తీల్లో పాదయాత్రలు చేస్తూ సమస్యల మూలాలను గుర్తిస్తున్నారు. మురుగు కాలువలు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షించి, జేసీబీల సాయంతో పూడికతీత పనులను వేగవంతం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డివిజన్లలోని ప్రతి వీధిలోనూ యాంటీ లార్వా ఆపరేషన్లతో పాటు ముమ్మరంగా ఫాగింగ్ చేయిస్తున్నారు.
తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, చిట్టచివరి ఇళ్లకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. “ఓట్లు వేయించుకున్నాక కనిపించరు అనుకున్నాం.. కానీ మా సమస్యలు అడగడానికి నేరుగా మా ఇంటికే వస్తున్నారు” అని బస్తీ ప్రజలు మురిసిపోతున్నారు.
ముఖ్యంగా గతంలో పెండింగ్లో పడిపోయిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను, వీధి దీపాల మరమ్మతులను కార్పొరేటర్లు వెంటనే మొదలు పెట్టడంపై మహిళలు, వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో జాప్యం వహిస్తే సహించేది లేదని కార్పొరేటర్లు అధికారులకు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఉదయాన్నే హాజరయ్యేలా చూడటం, చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడం వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
నూతన ప్రజాప్రతినిధుల ఈ దూకుడు చూస్తుంటే, నగరం త్వరలోనే అభివృద్ధి పథంలో పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
