అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువుకు తోడుగా వచ్చిన ఓ మహిళను మాటల్లో దించి, నమ్మించి గుర్తుతెలియని కేటుగాడు మూడున్నర తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని ప్రతిభా హాస్పిటల్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..
ఫిర్యాదుదారు తన అత్తకి సర్జరీ ఉండటంతో ఆమెకు సాయంగా ఉండేందుకు ప్రతిభా హాస్పిటల్కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి బాధితురాలితో మాటలు కలిపాడు. సదరు మహిళకు తెల్లగల్లు తాగే అలవాటు ఉండటంతో, నిందితుడు ఆమెను నమ్మించి గల్లు బట్టి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా మాటలతో నమ్మకం కలిగించి తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చాడు.
ఆసుపత్రిలో రద్దీగా ఉందని, దొంగల భయం ఎక్కువగా ఉందని బాధితురాలిని నిందితుడు భయపెట్టాడు. “బంగారు ఆభరణాలు వేసుకుని ఇలా తిరగకూడదు.. ఎవరో ఒకరు లాక్కెళ్తారు” అని నమ్మబలికాడు. నగలను తీసి భద్రపరుచుకోవాలని సూచించిన నిందితుడు, ఆమె చూస్తుండగానే ఒక గుడ్డలో నగలను చుట్టి ఆమె బ్యాగులో పెట్టినట్టు నటించాడు. బాధితురాలు నిజమేనని నమ్మి అప్రమత్తంగా లేని సమయంలో, నిందితుడు తన చేతివాటం ప్రదర్శించి నగలను మాయం చేసి అక్కడి నుండి చాకచక్యంగా జారుకున్నాడు.
నిందితుడు వెళ్ళిపోయిన కొంతసేపటికి అనుమానం వచ్చి బాధితురాలు తన బ్యాగును తనిఖీ చేసుకోగా, అందులో నగలు లేకపోవడంతో కంగుతిన్నారు. సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించిన బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
