ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించిన ఘటన నగరంలోని కాంటేశ్వర్ ప్రాంతంలో కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం: అంబేద్కర్ కాలనీకి చెందిన సదరు మహిళ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన విధులను ముగించుకుని ఇంటికి బయలుదేరారు. కంటేశ్వర్ అవుట్పోస్ట్ వద్ద ఒక ఆటో ఎక్కి తన నివాసమున్న అంబేద్కర్ కాలనీ వద్ద దిగారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోగా, మెడలో ఉన్న సుమారు తులంన్నర బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆమె షాక్కు గురయ్యారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు చాకచక్యంగా గొలుసును లాగేసినట్లు బాధితురాలు అనుమానిస్తున్నారు.
బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఆమె నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆటో ఎక్కిన ప్రాంతంలోని సిసి (CC) కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
