వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా . విగ్రహానికి కరెంట్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందారు. ఆర్మూర్ నుంచి సిరిసిల్ల కు తరలిస్తుండగాపాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం జరిగింది .
మరికొన్ని రోజుల్లో పండుగ ఉండటంతో విగ్రహాలను తీసుకెళ్తున్నారు. మండపాలను సిద్ధం చేసి ప్రతిమలను కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారీ వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్న క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. సిరిసిల్లకు చెందిన 15 మంది యువకులు ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్లో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు.
అక్కడి నుంచి ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా.. పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో గల కస్తూర్బా పాఠశాల సమీపంలో ట్రాక్టర్లో ఉన్న ఇద్దరికి విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయారు.
వెంటనే వారిని కామారెడ్డి జీజీహెచ్కు తరలించగా సిరిసిల్ల గోపాల్ నగర్కు చెందిన లక్ష్మీనారాయణ (19) మృతి చెందాడు. సుభాష్ నగర్కు చెందిన సాయికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
హైదరాబాద్ నగరంలో సైతం వినాయక విగ్రహాలను తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. బండ్లగూడలో ఇద్దరు, అంబర్పేట్లో ఒకరు చనిపోయారు. వినాయక చవితికి యువత ఎంతో సందడి చేస్తారు.
పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుంటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. విగ్రహం తీసుకు వెళ్లే మార్గంలో అడ్డుగా విద్యుత్ వైర్లు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
