అరెస్ట్..నగరంలోని సుభాష్ నగర్ పరిధిలో ఇటీవల కలకలం రేపిన వృద్ధురాలి గొలుసు దొంగతనం కేసును మూడవ టౌన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ హరిబాబు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న సుభాష్ నగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని మెరుపు వేగంతో పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టౌన్-3 పోలీసులు, సీసీఎస్ బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్-3 పోలీసు సిబ్బంది గత పది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు.ఎట్టకేలకు బుధవారం జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పట్టుబడిన వారు మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన షేక్ మహమ్మద్ కైఫ్ , అద్నాన్ గా గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వీరు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారనీ అన్నారు.
ఈ ముఠాలో కీలక సభ్యుడైన అమన్ పటేల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
