ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరగాలంటే నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా అధికారులు పనిచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య స్పష్టం చేశారు.
పోలీస్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, దోపిడీలు, పోక్సో మరియు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పురోగతిని సీపీ సమీక్షించారు.
ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన కొలిక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు.
కేసుల దర్యాప్తులో కేవలం సాధారణ విచారణకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించాలని సీపీ ఆదేశించారు. సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, కాల్డేటా విశ్లేషణ వంటి ఆధారాలను సేకరించడం ద్వారా కోర్టుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. సాక్ష్యాధారాల సేకరణలో అధికారులు అత్యంత పటిష్టంగా ఉండాలని సూచించారు.
నేర నియంత్రణలో భాగంగా రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని, అసాంఘిక శక్తులు సంచరించే హాట్స్పాట్లలో నిఘా పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. నేర చరిత్ర గల వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, పెండింగ్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ప్రజలకు భద్రతా భావన కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్రెడ్డి, మల్లేష్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు.
