వణికిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు. పీఆర్వోల ప్రచారంతో ఊదరగొడుతున్న విద్యాసంస్థలు..కొరపడిన విద్యాశాఖ అధికారుల నియంత్రణజిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి.
జిల్లాలో కొత్తగా కళాశాలలు, పాఠశాలలు పుట్టుకువచ్చాయి. అర్హత లేని వారు విద్యా సంస్థలను నడుపుతూ ఆడ్మిషన్ల కోసం పీఆర్ఓల ప్రచారంతో ఊదరగొడుతున్నాయి.
విద్యా సంస్థల పీఆర్ఓలు జిల్లాలోని చుట్టు పక్కల గ్రామాల్లో వెళ్ళి ఇప్పటికే ఆడ్మిషన్లు ముగిసిపోతున్నాయనే ప్రచారంతో తల్లిదండ్రులకు కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు బడుల్లో యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షే అన్న చందంగా మారుతోంది. ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువుకే ఖర్చవుతుండడంతో పేద, మధ్యతరగతి వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు.
గతేడాది కన్నా ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచాయి.ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇలా నిబంధనలను భేఖాతరు చేస్తున్నా సంబంధిత అధికారులు పాఠశాలల వైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడంలో విఫలమవుతున్నారు. ప్రతి ఏడాది ప్రైవేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారనీ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
అధిక ఫీజుల నియంత్రణపై అధికారుల పట్టింపేది ? ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది.
అధిక ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నారు.
