- ఏదో మూలన వెలుగులోకి వస్తున్న సంఘటనలు
- ఆస్తులు అమ్ముకుని ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్న పేద ప్రజలు
- ఆర్మూర్ లో సిండికేట్ గా మారిన శంకర్ దాదాలు
జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్;
నిర్లక్షపు మాటున పేదలను నిలువున దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో శంకర్ దాదాల ఆగడాలు చూసి ఇవి దవాఖానలు కాదు బాబోయ్… ‘దగా’ఖానలు అంటూ రోగులు బెంబేలెత్తుతున్నారు.
ఈ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిని అరికట్టాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వీరికి ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైంది పరిస్థితి. వైద్య పరీక్షల పేరిట చేసే టెస్టులకు ఫీజుల నియంత్రణ లేకపోవడంతో శంకర్ దాదాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాధి సోకి ఆసుపత్రిలో చేరుదామంటే రోగులు హడలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది.
జబ్బు నయం చేసుకుందామని ‘ఆశ’తో ఆసుపత్రికి వస్తే అందిన కాడికి దోచుకుంటున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. రోగుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మానవత్వం మరచి వ్యవహరిస్తున్నాయి. చిన్నపాటి రోగమైన… ప్రాణాంతకమైన వ్యాధి అయిన ఆసుపత్రిలో అడుగుపెడితే చాలు పరీక్షల పేరిట జలగల దోచుకుంటున్నాయి. దీంతో పేదవాడికి ఆరోగ్యం అందని ద్రాక్షగా మారుతుంది.
నిజామాబాద్ జిల్లాలోని రోజు రోజుకు పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ‘సిరి’ సంపదలు చేకూర్చే ద్రాక్షావనంగా మారుతు పేదల ‘లైఫ్’ తో వ్యాపారం చేస్తున్నాయి. శంకర్ దాదాల వ్యవహార శైలితో పేద ప్రజలు ఆస్తులను అమ్ముకొని ఆరోగ్యానికి ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ లలో యదెచ్చగా ప్రాణలతో ఆడుతున్న ఈ దందా కొనసాగుతోంది.
ఏకంగా ఆర్మూర్ పట్టణంలో కొంతమంది శంకర్ దాదాలు సిండికేట్ గా మారి రోగుల ప్రాణాలకు వెలకడుతూ… వైద్య వ్యవస్థకు మాయని మచ్చను మిగులుస్తున్నారు. అవసరం ఉన్న , లేకున్న… రక్త పరీక్ష ,మూత్ర పరీక్ష, థైరాయిడ్ పరీక్ష అంటూ రోగుల జేబులను గుల్ల చేస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలో ఇటీవల ఓ పేరు మోసిన ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నపాటి అనారోగ్యంతో ఓ రోగి ఆసుపత్రికి వస్తే టెస్టుల పేరట డబ్బులు వసూలు చేసి, కనీసం రిపోర్టు కూడా చూడకుండా మందులు ఇచ్చి పంపించారని ఓ పేద నిరుద్యోగి వాపోయాడు. ఇప్పటికైనా ఈ శంకర్ దాదాల దోపిడి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ కన్నేయాలని ప్రజలు కోరుతున్నారు.
