భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు.
శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డీ ఎఫ్ ఓ వికాస్ మీనా, రాష్ర్ట ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు.
వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ, అటవీ, డెయిరీ, పశువైద్య, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు.
అంతకుముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును చాటుతూ వ్యవసాయం, హౌసింగ్, ట్రాన్స్ కో, ఆర్టీసీ, వైద్యారోగ్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రవాణా శాఖ, 108, 102 అంబులెన్స్ లు, సంచార పశు వైద్యశాల తదితర శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లు నమూనాతో కూడిన హౌసింగ్ శకటానికి మొదటి బహుమతి దక్కగా, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఆర్టీసీ శకటం ద్వితీయ, వైద్యారోగ్య శాఖ శకటం తృతీయ బహుమతులను దక్కించుకున్నాయి.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. కాకతీయ హైస్కూల్, విశ్వ వికాస్, ఆర్.బీ.వీ.ఆర్.ఆర్, అభ్యాస స్కూల్, విజయ్ హైస్కూల్ తదితర పాఠశాలలకు చెందిన బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు.
బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని, జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో, జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో…
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
