రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిజామాబాద్ విభాగం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రైళ్లు, స్టేషన్ ప్రాంగణంలో మండే వస్తువుల రవాణాపై ఉక్కుపాదం మోపారు.
రైళ్లలో ప్రయాణించే సమయంలో బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్ వంటి ప్రమాదకరమైన, మండే స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వి.వి.సుబ్బారెడ్డి హెచ్చరించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పించడంతో పాటు.. ప్యాంట్రీ కార్, లినెన్, ఓబీహెచ్ఎస్ (OBHS) సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ప్రమాదకర వస్తువులను గుర్తించడం, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. స్టేషన్ ప్రాంగణంలో నిరంతరం అనౌన్స్మెంట్ల ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర వస్తువులను తరలిస్తున్న వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
