నగరంలో గురువారం నిర్వహించిన హనుమాన్ జయంతి శోభాయాత్రను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన నిఘా నీడలో నిర్వహించింది. శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు.
నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా యాత్ర సాగుతున్న తీరును, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా వీక్షించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. యాత్ర కారణంగా సాధారణ ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ వాహనాల మళ్లింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ట్రాఫిక్ విభాగాన్ని ఆదేశించారు.
భక్తులు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు.సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సంతోష్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.
