ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తోంది.
దీంతో ఎస్సారెస్పీ అధికారులు 10 వరద గేట్లను ఎత్తి గోదావరి నదిలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ఇన్ఫ్లో భారీగా కొనసాగుతూ ఉండడంతో అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
పెరుగుతున్న భారీ వరదను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈసారి ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వర్షాలు కురడంతోపాటు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఆశాజనకంగా కనబడలేదు.
అయితే గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పక్షం రోజుల్లో దాదాపు 5 సార్లు గేట్లను ఎత్తివేసి గోదావరి నదిలోనికి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు అధికారులు.
గేట్లు ఎత్తివేయడంతో ఆదివారం పర్యాటకులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక శోభను సంతరించుకుంది.
