జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఒకవైపు భక్తిశ్రద్ధలతో జరుగుతుంటే, మరోవైపు పోలీసుల అత్యుత్సాహం చూపిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామగ్రామాన యువత, ప్రజలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న ర్యాలీలు, ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.
గత ఐదేళ్లుగా జిల్లాలోని పలు గ్రామాల్లో శివాజీ విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు నేటికీ అనుమతులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత స్థలాల్లో, ఎవరికీ ఇబ్బంది లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామన్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
దీనిపై వివరణ కోరితే.. ఎస్ఐ నుంచి సీపీ వరకు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. “పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి” అంటూ పోలీసులు చెబుతున్న మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (రేవంత్ రెడ్డి ప్రభుత్వం) హిందువుల మనోభావాలను అణచివేయాలని చూస్తోందా? లేక పోలీస్ శాఖే కావాలని ఇదంతా చేస్తోందా? అని ప్రశ్నించారు. గద్దెలపై నుంచి విగ్రహాలను బలవంతంగా తొలగించడం, అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని మండిపడుతున్నారు.
కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్న విగ్రహాల ఏర్పాటు దరఖాస్తులను వెంటనే ఆమోదించాలి.అలాగే జయంతి వేడుకల సందర్భంగా అమాయక యువతపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
పోలీసులు తొలగించిన విగ్రహాలను తిరిగి అదే స్థలాల్లో సగౌరవంగా ప్రతిష్టించాలన్నారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీస్ శాఖ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తిని అణచివేయాలని చూస్తే భవిష్యత్తులో ఉద్యమం ఉప్పెనలా మారుతుందని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.
